ఈ రోజుల్లో పిల్లలు చదువు, హోమ్వర్క్, ట్యూషన్లతో చాలా ఒత్తిడిలో ఉంటున్నారు. ఇంటికి రాగానే కాలక్షేపం కోసం స్మార్ట్ఫోన్లతో సమయం గడిపే ప్రవర్తన ఎక్కువైంది. దీంతో వారు బహిరంగ ప్రదేశాల్లో గడిపే సమయం తగ్గిపోయింది. తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించకపోవడం, హడావుడి జీవన విధానం, మైదానాలకు దూరంగా ఉండటం వంటి కారణాలతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, పిల్లల్లో విటమిన్ డి లోపం పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం.
విటమిన్ డి
సూర్యరశ్మి నుంచి విటమిన్ డి శరీరానికి అధిక మొత్తంలో అందుతుంది. ఇది ఉచితంగా వచ్చే విటమిన్ ఇది శరీరంలో కాల్షియం స్థాయిని పెంచి, ఎముకలను దృఢంగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది. పైగా, ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి, అనేక ఆరోగ్య సమస్యలను నివారించగలదు. విటమిన్ డి లోపం వల్ల ఎముకల బలహీనత, శారీరక అలసట, మానసిక ఒత్తిడి, జీర్ణ సంబంధిత ఇబ్బందులు, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వస్తాయి.
విటమిన్ డి లోపం
2021లో 1-19 ఏళ్ల మధ్య బాలబాలికలపై నిర్వహించిన అధ్యయనంలో విటమిన్ డి లోపం గణనీయంగా ఉన్నట్లు గుర్తించారు:1-4 ఏళ్ల పిల్లలలో 14% ,5-9 ఏళ్ల పిల్లలలో 18% ,
10-19 ఏళ్ల పిల్లలలో 24% ,బాలురలో 14%, బాలికల్లో 34% మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు.ఈ లోపాన్ని అధిగమించేందుకు ఏడాదిలోపు చిన్నారులకు వైద్యుల సూచన మేరకు విటమిన్ డి ద్రావణాన్ని అందించాలి.

విటమిన్ డి లోపం వల్ల కలిగే సమస్యలు
రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.కండరాల బలహీనత, కీళ్ల నొప్పులు వస్తాయి.తరచూ జలుబు, జ్వరం, అలసట, నిస్సత్తువ వస్తాయి.ఆందోళన, ఒత్తిడి సమస్యలు పెరుగుతాయి.జుట్టు రాలిపోవచ్చు.జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిత్యం సూర్యకాంతిని శరీరానికి అందించాలి.కనీసం వారానికి రెండు సార్లు, అరగంట పాటు శరీరంపై ఎండ పడేలా చూసుకోవాలి.ఆవు పాలు, కోడిగుడ్డు, వెన్న, చేపలు వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి.పుట్టగొడుగులు,బచ్చలి ఆకు వంటి కూరగాయలను ఆహారంలో చేర్చాలి.విటమిన్ డి సమస్యను అధిగమించేందుకు పిల్లలను ఆడుకోవడానికి ప్రోత్సహించడం అత్యంత ముఖ్యమైనది.బహిరంగ ప్రదేశాల్లో ఆడే అవకాశాన్ని కల్పించాలి.వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలి.ఆరోగ్యకరమైన శారీరక వ్యాయామాలు చేయాలి.సైక్లింగ్, (స్విమ్మింగ్), జాగింగ్, యోగా వంటి శారీరక శ్రమ అవసరమైన కార్యక్రమాల్లో పాల్గొనాలి.
తల్లిదండ్రుల బాధ్యత
సమాజంలో మారుతున్న జీవనశైలితో పిల్లలు ఆటలు మరిచిపోతున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ, వారిని నిత్యం శారీరక వ్యాయామం చేయించాలి. మైదానాల్లో గడిపే సమయాన్ని పెంచేందుకు ప్రోత్సహించాలి. విటమిన్ డి లోపాన్ని అధిగమించేందుకు సరైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, సూర్యరశ్మి వల్ల కలిగే ప్రయోజనాలను అవగాహన చేయడం చాలా అవసరం.పిల్లల్లో విటమిన్ డి లోపం పెరగడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీన్ని నివారించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి.