అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం శుభవార్త అందించింది. చాలాకాలంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికగా మారిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించడంతో పాటు, విశాఖ కేంద్రంగా విశాఖ రైల్వే డివిజన్ను ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని కేంద్రం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది.

విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబడిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని 410 కిలోమీటర్లుగా రైల్వే శాఖ నిర్ణయించింది. వాల్తేరులో ఉన్న ఆంధ్రప్రదేశ్ రైల్వే సెక్షన్లను విశాఖకు బదిలీ చేశారు. కొండపల్లి-మోటుమర్రి సెక్షన్ను విజయవాడ డివిజన్కు, విష్ణుపురం-పగిడిపల్లి, విష్ణుపురం-జాన్పాడ్ మార్గాలను సికింద్రాబాద్ డివిజన్కు మార్చింది. విశాఖ డివిజన్ పరిధిని కూడా తిరిగి నిర్ణయించింది. విశాఖ డివిజన్ పరిధిలో ఏ ఏ మార్గాలను కలిపేలా ఉన్నాయనే విషయం కూడా కేంద్రం వెల్లడించింది. ఈ కొత్త జోన్ పరిధిలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు కూడా చేర్చబడ్డాయి.
132 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ను కొనసాగిస్తోంది కేంద్రం. వాల్తేరును “విశాఖపట్నం డివిజన్” గా పునర్ నామకరణం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ హర్షం వ్యక్తం చేశారు. విశాఖ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ కేంద్రం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం విశాఖ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుందన్నారు. ఈ 4 డివిజన్లతో విశాఖపట్నం రైల్వే మరింత బలోపేతం కానుంది. మెరుగైన మౌలిక వసతులు, రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎంపీ శ్రీభరత్ వివరించారు.