కర్ణాటకలోని నాగమంగళ టౌన్లో 144 సెక్షన్
కర్ణాటకలోని మాండ్యా జిల్లా నాగమంగళ పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నిన్న రాత్రి వినాయకుని నిమజ్జనంలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. షాపులకు నిప్పుపెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
బదరికొప్పలు గ్రామానికి చెందిన కొందరు గణపతి విగ్రహ నిమజ్జనం కోసం ఊరేగింపుగా బ్యాండ్తో హంగామా చేస్తూ వెళ్తున్నారు. మెయిన్రోడ్డుపై ఊరేగింపు వెళ్తుండగా, సమీపంలోని మసీదు వద్దకు రాగానే ఎవరో రాళ్లు రువ్వారు. దీంతో ఆగ్రహించిన మరో గ్రూప్, సమీపంలోని షాపులకు నిప్పు పెట్టింది. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. పరిస్థితి అదుపు తప్పింది.
ఇరువర్గాల వారిని పోలీసులు చెరదగొట్టారు. ఆపై లాఠీఛార్జ్ చేశారు. అప్పటికే షాపులు తగలబడ్డాయి. పరిస్థితి గమనించిన పోలీసుల వెంటనే 144 సెక్షన్ విధించారు. ఈ ఘటనపై ఆగ్రహించిన హిందూ సంఘాలు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగాయి.