భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన “ఆపరేషన్ సింధూర్” నేపథ్యంలో, పాకిస్థాన్ అనవసర ఆరోపణలతో అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్న తరుణంలో, పాకిస్థాన్ చేస్తున్న కుతంత్రాలను, ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్ను భారత్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకుంటోందని పాక్ చేస్తున్న నిరాధార ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.
పాక్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం – మిస్రీ
విక్రమ్ మిస్రీ ప్రకటనలో స్పష్టంగా వెల్లడించారు-ఆఫ్ఘనిస్థాన్ను లక్ష్యంగా భారత్ క్షిపణి ప్రయోగాలు చేస్తోందని పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలు, నిజానికి భారత్-ఆఫ్ఘన్ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని దెబ్బతీయాలనే కుట్రగా మిస్రీ పేర్కొన్నారు. పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా నిరధారమైనవి. ఆఫ్ఘన్ ప్రజలకు మా దేశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గడిచిన ఏడాదిన్నర కాలంగా అక్కడి మౌలిక సదుపాయాలను, ప్రజలను ఎవరు లక్ష్యంగా చేసుకుంటున్నారో (పరోక్షంగా పాకిస్థాన్ను ఉద్దేశిస్తూ) ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదని భావిస్తున్నాను. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం సొంత దేశ ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకతను, విమర్శలను ఎదుర్కొంటోంది అని మిస్రీ తెలిపారు.
పాకిస్థాన్కు స్వదేశంలోనే వ్యతిరేకత
మిస్రీ తన ప్రకటనలో మరింత తీవ్రంగా పాకిస్థాన్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పాకిస్థాన్ సొంత దేశంలో ప్రజలు తమ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, దాన్ని విస్మరించి భారత్ను విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు. పాకిస్థాన్ ఆర్మీ అధికారుల తీరును విమర్శిస్తూ, “భారత ప్రభుత్వంపై ఇక్కడి పౌరులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తారని, తద్వారా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి లోనవుతుందని పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధులు భ్రమల్లో సంతోషం వెతుక్కుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిదానికీ ఒక నిర్దిష్టమైన విధానం ఉంటుందని, ఆ విషయం పాకిస్థాన్కు తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించదని ఆయన ఎద్దేవా చేశారు.
Read also: Operation Sindoor: యుద్ధంలో మరణించిన ప్రముఖ టెర్రరిస్టులు