వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విదేశీ పర్యటన కోసం సీబీఐ కోర్టును అనుమతి కోరారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నార్వే, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
విజయసాయిరెడ్డి పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సీబీఐ కోర్టును కోరింది. సీబీఐ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ పరిణామం రాజకీయంగా మరింత ఆసక్తికరంగా మారింది.
విదేశీ పర్యటనకు అనుమతిని కోరడం వెనుక విజయసాయిరెడ్డి వ్యక్తిగత లేదా రాజకీయ ప్రణాళికలున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం తో ఈ పిటిషన్కు మరింత ప్రాధాన్యత పెరిగింది. వైసీపీ నేతగా కీలక బాధ్యతలు నిర్వహించిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు రాజకీయాల నుంచి దూరమవుతున్నట్లు ప్రకటించడం వివాదాలకు దారి తీసింది. ఈ సందర్భంలో ఆయన విదేశీ పర్యటనకు అనుమతిని కోరడం, సీబీఐ కోర్టులో పిటిషన్ వేయడం పలు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీబీఐ కోర్టు అనుమతిస్తుందా లేదా అనేది 27న జరిగే విచారణ అనంతరం తేలనుంది.