విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్ర స్పందన
ఏపీ లిక్కర్ స్కామ్ విచారణకు సంబంధించి ఇటీవల రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుల కోటరీ వల్ల తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆరోపించారు. కోటరీ వ్యవహారంపై చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు తక్షణమే వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. విజయసాయి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, పార్టీ నుంచి బయటకు వెళ్లాక ఏదో రకంగా వైసీపీపై నిందలు వేయాలని ఆయన యత్నిస్తున్నారని విమర్శించారు.
విజయసాయి ఆరోపణలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు విజయసాయిరెడ్డే పార్టీ వ్యవహారాలను చక్రం తిప్పారని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. “కోటరీ ఉందో లేదో విజయసాయికి తెలియదా? ఎవరు నడిపారో తెలియదా?” అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో నెంబర్ 2 నుంచి 2 వేల స్థానానికి పడిపోయానని విజయసాయి చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. “వైసీపీలో నెంబర్ 2 అనేది ఉండదు. నెంబర్ 1 నుంచి 100 వరకు అన్నీ జగనే. పార్టీని ఒక్క వ్యక్తి ధైర్యంగా నడిపిస్తున్నారు. మిగిలినవాళ్లు అందుకు తోడ్పడుతున్నారు” అని స్పష్టం చేశారు.
లిక్కర్ స్కామ్పై వైసీపీ నిరాకరణ
లిక్కర్ స్కామ్ అంటూ కొందరు నేతలను బెదిరించి లొంగదీసుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సుబ్బారెడ్డి ఆరోపించారు. వైసీపీ పాలనలో ఎలాంటి అవినీతి స్కాములు జరగలేదని, పార్టీ నాయకులు అందరూ చట్టపరమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చట్ట విరుద్ధమైన కేసుల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించి వైసీపీ పరువును దెబ్బతీయాలనే కుట్ర కొనసాగుతుందని ఆయన విమర్శించారు. అయితే, ప్రజలు వైసీపీపై నమ్మకం పెట్టుకున్నారని, ఎలాంటి దుష్ప్రచారాన్ని ఎదుర్కొనే శక్తి తమ పార్టీకి ఉందని హామీ ఇచ్చారు.
న్యాయపోరాటానికి సిద్ధమైన వైసీపీ
సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు — “ఏ కుట్రలు చేసినా, ఎంత గాలింపులు చేసినా,ఎన్నికేసులు పెట్టినా మేము వెనక్కి తగ్గం. ప్రతి అవాస్తవ ఆరోపణకు చట్టపరంగా సమాధానం ఇస్తాం. న్యాయపరంగా మేం పోరాటం కొనసాగిస్తాం. ప్రజలు ఎంత మద్దతు ఇస్తారో రానున్న రోజుల్లో అందరికీ తెలుస్తుంది.”
READ ALSO: Hari Venkata Kumari: మేయర్ పదవిని కోల్పోయిన వైసీపీ