ఒంగోలులో చోటుచేసుకున్న దారుణ హత్య ఘటనపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు వీరయ్య చౌదరి హత్యకు గురైన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్పందన చూపించారు.ఇవాళ ఆయన అమలనబ్రోలు గ్రామానికి చేరుకుని, వీరయ్య చౌదరి భౌతికకాయానికి ఘన నివాళులు అర్పించారు. పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన చంద్రబాబు, తర్వాత కుటుంబ సభ్యులను కలసి ఓదార్చారు.వారికి ధైర్యం చెప్పడం పాటు, పార్టీ తరఫున పూర్తి మద్దతుగా నిలవాలని భరోసా ఇచ్చారు.ఈ తీరని విషాద సమయంలో మీకు పార్టీ పక్కలో ఉంటుంది అని మాటిచ్చారు.
అంతేగాక, వీరయ్య చౌదరి అంత్యక్రియల్లో కూడా పాల్గొననున్నట్లు సమాచారం.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వెంట అనేక మంది ముఖ్య నాయకులు, మంత్రులు కూడా ఉన్నారు.వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు వారి కుటుంబానికి పరామర్శలు తెలిపారు. ఈ ఘటనపై మాట్లాడిన చంద్రబాబు, హత్య తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సాధారణ హత్య కాదు… కరడుగట్టిన నేరస్తుల కంటే క్రూరంగా చేశారు అంటూ తెలిపారు. ఒకే వ్యక్తిని 53సార్లు కత్తితో పొడిచారని చెబుతూ, హత్య విధానంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి వారు భూమ్మీద ఉండే అర్హతలే లేరు అంటూ ఘాటుగా స్పందించారు. నిందితులను ఎంత తెలివైనవాళ్లు అయినా తప్పించుకోలేరని, వారు ఎక్కడున్నా పట్టుకుంటామని చెప్పారు. ఇప్పటికే 12 ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయని వివరించారు.

వీరయ్య చౌదరికి న్యాయం జరిగే వరకు తాము వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు. వీరయ్య చౌదరి కేవలం నాయకుడే కాదు, మానవతా దృక్పథం కలిగిన నేతగా గుర్తుంచుకోవాలన్నారు. లోకేశ్ పాదయాత్రలో 100 రోజులు పాల్గొనడం, పార్టీ కోసం ఎంతో కృషి చేయడం గుర్తుచేశారు. ‘‘ఎవరు పిలిచినా స్పందించే మంచి మనిషిని కోల్పోయాం అని చంద్రబాబు తెలిపారు. అమ్మనబ్రోలు మండలంలో టీడీపీకి 10 వేల ఓట్ల మెజారిటీ రావడం, వీరయ్య చౌదరి ప్రజల్లో ఉన్న ఆదరణను స్పష్టం చేస్తుందన్నారు. ఇలాంటి నేతను హత్య చేయడం తట్టుకోలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరిగా, చంద్రబాబు రాజకీయ హత్యలు చేస్తున్న వారిని గట్టిగా హెచ్చరించారు. ‘‘ఇలాంటి చర్యలు నమ్మకాన్ని చంపే ప్రయత్నం. కానీ న్యాయం జరుగుతుందనే నమ్మకం నిలబెట్టుతాం’’ అని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు భయపడవద్దని, కుటుంబ పెద్దగా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Read Also : Andhra Pradesh: పదో తరగతి ఫలితాల్లో నేహాంజని అనే బాలికకు 600/600 మార్కులు