నీటమునిగిన వట్టెం పంప్‌హౌస్‌

తెలంగాణ లో కురుస్తున్న భారీ వర్షాలతో పంప్‌హౌస్‌లు నీటమునుగుతున్నాయి. గత నెల నల్లగొండ జిల్లాలోని సుంకిశాల పంప్‌హౌస్‌ నీటమునిగిన విషయం మరువకముందే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో (PRLI) మరో ఘటన చోటుచేసుకున్నది. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన పీఆర్‌ఎల్‌ఐ పథకంలో భాగంగా నాగర్‌కర్నూలు జిల్లాలోని కుమ్మెర వద్ద నిర్మించిన వట్టెం పంప్‌హౌస్‌ నీటమునిగింది. ప్యాకేజీ-7లోని ఆడిట్‌ నుంచి పంప్‌హౌస్‌ సొరంగమార్గంలోకి నాగనూలు, నాగర్‌కర్నూలు చెరువల నుంచి భారీగా వరద వచ్చిచేరింది.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని గొలుసుకట్టు చెరువులు భారీ వరదతో పొంగిపొర్లాయి. తూడికుర్తి, శ్రీపురం, నాగనూలు చెరువులు నిండి అలుగు పారాయి. ఈ చెరువుల సమీపంలో పీఆర్‌ఎల్‌ఐ పథకం టన్నెల్‌ ఉన్నది. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన మార్గం మీదుగా ఈ చెరువుల వరద నీరు సర్జిపూల్‌లోకి వచ్చి గేట్ల ద్వారా పంపుహౌస్‌లోకి వెళ్లింది. దీంతో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తున్నది.