Mohana Ranga Rao: గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20న జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు ఓలుపల్లి మోహనరంగాకు విజయవాడ కోర్టు ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించింది. రాజమహేంద్రవరం పోలీసులు మంగళవారం స్థానికంగా అతన్ని అదుపులోకి తీసుకొని గన్నవరం, సీఐడీ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని తొలుత గన్నవరం ఠాణాకు, తర్వాత విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించారు. బుధవారం విజయవాడలోని సీఐడీ కోర్టులో హాజరుపర్చారు.

ఏ1గా ఉన్న రంగా అజ్ఞాతంలోకి వెళ్లారు
ఈ కేసులో నిందితులు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా, విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ తిరస్కరించింది. దీంతో ఏ1గా ఉన్న రంగా అజ్ఞాతంలోకి వెళ్లారు. వంశీ అరాచకాల్లో రంగా కీలకంగా వ్యవహరించేవారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో రంగా పాత్రపై ఫొటోలు, వీడియో సహిత ఆధారాలున్నాయి. ఇక, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ రంగా ఏ5గా ఉన్నారు.