వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన రిమాండ్ను విజయవాడ సీఐడీ కోర్టు పొడిగించింది. ఈ కేసులో వంశీ రిమాండ్ గడువు ఈ రోజు ముగిసింది.ఈ నేపథ్యంలో, పోలీసులు ఆయనను జిల్లా జైలు నుంచి తీసుకువచ్చి విజయవాడ సీఐడీ కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం, వంశీకి మే 21వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో, పోలీసులు ఆయనను తిరిగి జిల్లా జైలుకు తరలించారు.ఇదే సమయంలో, సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో కూడా వంశీకి నిరాశే ఎదురైంది.ఈ కేసులో రిమాండ్ గడువు ముగియడంతో ఆయనను విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం మే 13 వరకు రిమాండ్ను పొడిగించింది.ఈ కేసులో వంశీతో పాటు వెలినేని శివరామకృష్ణ ప్రసాద్, గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, వేల్పూరు వంశీబాబులను కూడా అరెస్టు చేసి రిమాండ్కు పంపిన సంగతి విదితమే. నిన్న వీరందరి రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపర్చగా, వారందరికీ కూడా రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Also : AP High Court: ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో భారీ ఊరట