వల్లభనేని వంశీ అరెస్ట్ కు రంగం సిద్ధం..?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఆయనను ఏ1 ముద్దాయిగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా, ఎమ్మెల్యేగా ఆయన సూచనల మేరకే ఆ పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు.

ఇప్పటికే బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా 15 మందిని గత నెల 9వ తేదీన అరెస్టు చేశారు. ఆ తరువాత మరో ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ కేసులో మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం వంశీ తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేయడానికి మూడు స్పెషల్ టీమ్స్ హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. మరోవైపు వంశీ అమెరికా వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరి వంశీ ఎక్కడ ఉన్నాడు..? ఆయన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.