విజయవాడ జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలు, కాళ్ల వాపులతో బాధపడుతున్న వంశీకి శనివారం రాత్రి పరిస్థితి బాగోలేదని గుర్తించిన జైలు అధికారులు వెంటనే ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు 2డీ ఎకో, ఛాతీ ఎక్స్రే, ఈసీజీ వంటి కీలక పరీక్షలు నిర్వహించారు.
బీపీలో హెచ్చుతగ్గులు
వంశీకి ఇచ్చిన మందులు మార్చిన తరువాత బీపీలో హెచ్చుతగ్గులు వచ్చాయని వైద్యులు తెలిపారు. అదే సమయంలో కాళ్ల వాపులు కూడా కనిపించాయని పేర్కొన్నారు. వైద్యులు తాత్కాలికంగా అవసరమైన చికిత్సను అందించారు. వంశీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్య బృందం ఆయనకు పూర్తిస్థాయిలో విశ్రాంతి అవసరమని తెలిపింది.
థైరాయిడ్ సంబంధిత సమస్యలు
ఇక, థైరాయిడ్ సంబంధిత సమస్యలు ఉన్నా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించడానికి మరోసారి వంశీని ఆసుపత్రికి తీసుకురావాల్సిందిగా వైద్యులు సూచించారు. వంశీ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నుంచి పూర్తిస్థాయి వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని జైలు వర్గాలు వెల్లడించాయి.
Read Also : Mahanadu : ఈనెలలోనే TDP ‘మహానాడు’.. ఏర్పాట్లు షురూ