విజయవాడ జైలులో అనారోగ్యానికి గురైన వల్లభనేని వంశీ – వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు
వివిధ క్రిమినల్ కేసుల విచారణలో భాగంగా విజయవాడ సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ శనివారం మధ్యాహ్నం సమయంలో అతనికి కాళ్ల వాపులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో, జైలు సిబ్బందికి వెంటనే సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికారులు ముందుగా జైలు ప్రాంగణంలోనే ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు తక్షణ చర్యలు తీసుకున్నారు. వైద్యులు వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందని నిర్ధారించడంతో చికిత్స అనంతరం ఆయనను మళ్లీ జైలుకు తరలించారు.
అత్యవసర చికిత్స – మూడు గంటలపాటు వైద్య పరీక్షలు
వంశీ అనారోగ్యానికి సంబంధించిన సమాచారం ఆలస్యంగా రావడంతో ఆసుపత్రిలో విధులు ముగించుకుని వెళ్లిన వైద్యులను తిరిగి పిలిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఆసుపత్రి వర్గాలు త్వరితగతిన స్పందించి, అత్యవసర చికిత్సను ప్రారంభించాయి. వంశీని ఆసుపత్రిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్లోని కార్డియాలజీ విభాగంలో ఉంచి, గుండె నిపుణులు, శ్వాసకోశ నిపుణులు, జనరల్ ఫిజీషియన్ల పర్యవేక్షణలో 2డీ ఎకో, ఛాతీ ఎక్స్రే, ఈసీజీ తదితర కీలక వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం 4:15 గంటలకు ఆసుపత్రికి తీసుకురాగా, రాత్రి 7:15 గంటల వరకు ఆయన పరీక్షలు కొనసాగాయి.
బీపీ మాత్రల మార్పే అనారోగ్యానికి కారణం
వైద్యులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం, మూడు వారాల క్రితం వల్లభనేని వంశీకి బీపీ నియంత్రణకు వాడే మాత్రలను మార్చడం వల్ల రక్తపోటులో హెచ్చుతగ్గులు వచ్చాయని స్పష్టం చేశారు. ఇదే కారణంగా శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తినట్టు అభిప్రాయపడ్డారు. వంశీకి గతంలో నుంచే ఆస్తమా సమస్య ఉండటంతో, తాజా పరిస్థితిలో అది మరింత ప్రభావం చూపినట్టు వైద్యులు తెలిపారు. కాళ్ల వాపులు కూడా రక్తపోటు మార్పుల కారణంగానే వచ్చి ఉండవచ్చని పేర్కొన్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలేమీ లేవని నిర్ధారించడంతో, రాత్రి 8 గంటల సమయంలో వంశీని తిరిగి జైలుకు తరలించారు.
తిరిగి ఆసుపత్రికి తీసుకురావాల్సిన సూచన
థైరాయిడ్ సంబంధిత వైద్య పరీక్షలు ఇంకా జరగాల్సి ఉన్నందున, వంశీకి ఉదయం అల్పాహారం తీసుకునే ముందు ఆసుపత్రికి తీసుకురావాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. నెలరోజుల క్రితమే వంశీ అనారోగ్యం గురించి పేర్కొనడంతో జైలు అధికారులు అప్పట్లో కూడా ప్రభుత్వ వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించినట్టు సమాచారం. వంశీ ఆరోగ్యం విషయంలో అధికారులు, పార్టీ నేతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
వంశీ అనుచరుడు ఓలుపల్లి రంగా డిశ్చార్జ్
ఇదే రోజు వంశీకి అత్యంత సన్నిహితుడిగా భావించబడే ఓలుపల్లి మోహనరంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం కుదుటపడటంతో అధికారులు ఆయన్ను తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ వంటి కేసుల్లో రంగా రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 1న ఆయన కూడా అనారోగ్యానికి గురవడం వల్ల ఆసుపత్రికి తరలించారు.
read also: Amaravati: అమరావతి నిర్మాణ పనులు వేగవంతం :సీఎం చంద్రబాబు