ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 19.95 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిసింది. ఢిల్లీ ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, కేంద్ర మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోని అన్ని స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోందని ప్రధాని మోడీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. ఇక్కడి ఓటర్లందరూ ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పూర్తి ఉత్సాహంతో పాల్గొని తమ విలువైన ఓటును వేయాలని ప్రధాని కోరారు. మొదటిసారి ఓటు వేయబోతున్న యువ ఓటర్లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొదట ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటింగ్ లో కొత్త రికార్డును నెలకొల్పాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు.

ఆ సమయంలోనే హోంమంత్రి అమిత్ షా కూడా ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోలింగ్ గురించి ప్రజలకు సూచించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోయే సోదర సోదరీమణులు తప్పుడు వాగ్దానాలు, కలుషిత యమునా నది, మద్యం దుకాణాలు, చెడిపోయిన రోడ్లు, మురికి నీటికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమం పట్ల బలమైన ట్రాక్ రికార్డ్, ఢిల్లీ అభివృద్ధి పట్ల స్పష్టమైన దార్శనికత కలిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు మీ ఒక్క ఓటు ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాజధానిగా మార్చగలదన్నారు.