ప్రధాని మోడీకి ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు బైడెన్

US President Biden called Prime Minister Narendra Modi

వాషింగ్టన్‌: ఉక్రెయిన్-రష్యా యుద్ధం, బంగ్లాదేశ్‌లోని హిందువులతో పాటు మైనారిటీల భద్రత అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చర్చించారు. ఈ మేరకు సోమవారం ఇరువురు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని ఎక్స్ వేదికగా ప్రకటించారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌లో ప్రధాని మోడీ ఇటీవలే పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన ముగిసిన నేపథ్యంలో మోడీకి బైడెన్ ఫోన్ చేశారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘ఇవాళ ఫోన్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మాట్లాడాను. ఉక్రెయిన్‌లో పరిస్థితితో పాటు వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై వివరణాత్మక అభిప్రాయాలను పంచుకున్నాం. శాంతి, స్థిరత్వాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి భారత్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని నేను పునరుద్ఘాటించాను. బంగ్లాదేశ్‌లో పరిస్థితిపై కూడా చర్చించాం. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల భద్రతపై మేము చర్చించుకున్నాం. వీలైనంత త్వరగా బంగ్లాదేశ్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాం’’ అని మోడీ వివరించారు.

ఉక్రెయిన్‌లో పరిస్థితిపై చర్చల సమయంలో బైడెన్‌కు ప్రధాని మోడీ వివరించారని అధికారులు వెల్లడించారు. చర్చలు, దౌత్య మార్గంలో సమస్య పరిష్కరించుకోవాలనే వైఖరికి భారత్ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా మోడీ పునరుద్ఘాటించారని పేర్కొన్నారు. శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు భారత్ మద్దతిస్తుందని, క్వాడ్‌తో పాటు వివిధ వేదికల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉండాలని ఇరువురు నేతలు నిర్ణయించారని అధికారులు వివరించారు.