నేడు రాంచీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన..

జార్ఖండ్‌ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రుల పర్యటనలు పెరిగిపోయింది. ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర రాజధాని రాంచీకి చేరుకోనున్నారు. రాంచీలో జరగనున్న పార్టీ రాష్ట్ర విస్తరణ కార్యవర్గ సమావేశానికి అమిత్ షా హాజరై ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో అమిత్ షా బీజేపీ కార్యకర్తలకు జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ విజయానికి కావాల్సిన అంశాలను తెలియజేయనున్నారు.

రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయికి చెందిన నేతలు, వివిధ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. రెండు విడతలుగా జరిగే ఈ సమావేశంలో తొలి సెషన్‌లో ఉదయం 10.30 గంటల నుంచి రాష్ట్ర నాయకులు, కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి షా ప్రసంగించనున్నారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా కేంద్రమంత్రి అమిత్ షా సన్మానించనున్నారు.

ఇక, రెండో సెషన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం కో-ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, బీజేపీ ఇన్‌ఛార్జ్ లక్ష్మీకాంత్ వాజ్‌పేయి, పలువురు సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.