భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ..మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది: నిర్మలా

union-finance-minister-nirmala-sitharaman-tabled-the-economic-survey-of-india-2023-24

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభమయ్యాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఎన్డీఏ కూటమి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాంతో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టబోతోంది. ఈ క్రమంలో బడ్జెట్‌కు ఒక రోజు ముందుగా నేడు 2023-24 ఆర్థికసర్వేను ఆర్థిక మంత్రి లోక్‌ సభలో ప్రవేశపెట్టారు. ‘భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పటిష్టంగా ఉంది’ అని ఈ ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల నడుమ అధిక వృద్ధి ఆకాంక్షలు కలిగిన దేశానికి మార్పు మాత్రమే స్థిరంగా ఉంటుందని ఈ సర్వే తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, వాతావరణం వంటి కీలకమైన ప్రపంచ సమస్యలపై ఒప్పందాలను చేరుకోవడం కష్టంగా మారిందని పేర్కొంది.

2022 నుంచి ప్రైవేటు రంగం పెట్టుబడులు పెడుతున్నప్పటికీ కొన్నేళ్లుగా ప్రభుత్వ పెట్టుబడులు మూలధనాన్ని కొనసాగించాయని ఈ ఆర్థిక సర్వే స్పష్టంచేసింది. గడచిన రెండు సంవత్సరాలుగా 7.0 శాతం వృద్ధిరేటును నమోదు కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో అధికంగా 9.7 శాతం వృద్ధిరేటు నమోదయ్యే అవకాశం ఉందని ఈ ఆర్థిక సర్వే అంచనా వేసింది. కొన్ని నిర్దిష్ట ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ, ప్రధాన ద్రవ్యోల్బణం చాలావరకు నియంత్రణలో ఉందని తెలిపింది.

2023 కంటే 2024లో వాణిజ్యలోటు తక్కువగా ఉందని ఆర్థిక సర్వే వెల్లడించింది. జీడీపీలో కరెంట్‌ ఖాతా లోటు దాదాపు 0.7 శాతంగా ఉందని పేర్కొంది. ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కరెంట్‌ ఖాతా మిగులును నమోదు చేసినట్లు తెలిపింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఈ ఆర్థిక సర్వే పేర్కొన్నది. 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్‌ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ఈ సర్వే సూచించింది. 2023-24 ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందించింది.

ప్రధాన ఆర్థిక సలహాదారు పర్యవేక్షణలో ఈ ఆర్థిక సర్వేను రూపొందించారు. ఇక ఆర్థికమంత్రిగా నిర్మలాసీతారామన్‌ ఏడోసారి లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గతంలో ఆర్థికమంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్‌ ఐదుసార్లు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా ఆయన రికార్డును నిర్మలాసీతారామన్‌ గత ఏడాదే బద్దలుకొట్టారు. ఇప్పుడు ఆ రికార్డును మరింత మెరుగుపర్చుకోబోతున్నారు.