UNESCO Recognition : భారతదేశం విభిన్న సంస్కృతులకు ఆలవాలం. గొప్ప తాత్విక ఆధ్యాత్మిక సంపదకు నిలయం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎన్నో కళలకు ప్రతీతి. భిన్నత్వంలో ఏకత్వంతో ప్రపంచ దేశాలలో సమున్నతంగా సగర్వంగా తలెత్తుకు జీవిస్తున్న భారత్ తాజాగా మరొక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. భారతదేశపు కీర్తి కిరీటంలో యునెస్కో నుంచి తాజాగా వచ్చిన ఒక గుర్తింపు కలికితురాయిగా నిలిచింది. భారతదేశపు గొప్ప సాంస్కృతిక, తాత్విక సంపదకు గుర్తింపుగా, గౌరవ సూచకంగా భగవద్గీత, నాట్యశాస్త్రం యునెస్కో మెమొరీ ది వరల్డ్ రిజిస్టర్లో స్థానం సంపాదించాయి. ఇది భారతీయులందరూ గర్వించదగిన శుభ విషయం.
భగవద్గీతకు యునెస్కోలో చోటు దక్కటం భారతీయులంతా గర్వించదగిన విషయం
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన, వేద వ్యాసుడు రచించిన భగవద్గీత తో పాటు, భరతముని రచించిన నాట్య శాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో స్థానం దక్కడం ఒక అరుదైన గుర్తింపు. భగవద్గీత అనేది భారతీయ మతపరమైన ఆలోచన యొక్క గొప్ప సంశ్లేషణ, ధర్మం యొక్క వైదిక భావన. హిందువులు భగవద్గీతను అత్యంత పవిత్రమైన గ్రంథంగా భావిస్తారు. అటువంటి భగవద్గీతకు యునెస్కోలో చోటు దక్కటం భారతీయులంతా గర్వించదగిన విషయం. ఇక ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరూ గర్వించదగిన క్షణమిది అని భారత ప్రధాని నరేంద్ర మోడీ తన పోస్టులో వెల్లడించారు.
ఇది మన సంస్కృతికి, జ్ఞానానికి లభించిన విశ్వవ్యాప్త గుర్తింపు
భగవద్గీత మరియు నాట్యశాస్త్రం యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కించుకోవడం ఇది విశ్వవ్యాప్తమైన గుర్తింపును మన సంస్కృతికి, భారతీయ జ్ఞానానికి అందించినట్టు అని ఆయన పేర్కొన్నారు. భగవద్గీత మరియు నాట్య శాస్త్రం శతాబ్దాలుగా మన నాగరికతను మరియు చైతన్యాన్ని పెంపొందించాయని ప్రధాని మోడీ అన్నారు. ఈ రెండు గ్రంథాల అంతర్దృష్టులు ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అని తన ఎక్స్ ఖాతాలో మోదీ పేర్కొన్నారు.
Read Also: మహారాష్ట్రకు చేరిన హిందీ వివాదం..ప్రభుత్వం ఉత్తర్వులపై విపక్షాల ఆగ్రహం