ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్లో గత మూడు మ్యాచ్లలో అంపైర్లు ఏదో ఒక వింత చేస్తూనే ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఐపీఎల్ సీజన్లో అంపైర్లు ప్లేయర్ల బ్యాట్లను తనిఖీ చేశారు. ఆదివారం జరిగిన ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్, ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లలో ఈ ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరుగుతున్నప్పుడు అంపైర్ మ్యాచ్ ను ఆపి ఇద్దరు ఆటగాళ్ల బ్యాట్లను తనిఖీ చేశాడు. ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్ లో అంపైర్లు ఫిల్ సాల్ట్, షిమ్రాన్ హెట్మెయర్ బ్యాట్లను పరిశీలించారు. హెట్మెయర్ బ్యాటింగ్ కు వచ్చిన వెంటనే అంపైర్ ఆటను ఆపి బ్యాట్ గేజ్ ను ఉపయోగించి హెట్మెయర్ బ్యాట్ ను తనిఖీ చేశారు. హెట్మెయర్ బ్యాట్ అధికారిక ఐపీఎల్ మార్గదర్శకాలకు సరిపోతుందో లేదో పరిశీలించారు.
నిబంధనలు
ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో అంపైర్ అకస్మాత్తుగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాట్ ను పరిశీలించిన సంఘటన క్రికెట్ అభిమానులలో చర్చకు దారి తీసింది. హార్దిక్ బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు అంపైర్లు పాండ్యా బ్యాట్ సైజు ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఉందో లేదో తనిఖీ చేశారు. బ్యాట్ ను కొలిచేందుకు ఓ పరికరాన్ని ఉపయోగించారు. అయితే హార్దిక్ పాండ్యా బ్యాట్ అనుమతించబడిన పరిణామం 25 అంగుళాల లోపే ఉంది. ఈ బ్యాట్లను పరిశీలించేందుకు అంపైర్ ఒక గేజ్ ను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంపై ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

బ్యాట్ సైజు
బ్యాట్ పరిమాణం ఒక నిర్దిష్ట పరిమితిని మించి ఉంటే అతనికి కొంత శిక్ష విధించబడవచ్చు లేదా బ్యాట్ను జప్తు చేయవచ్చు. కానీ అంపైర్లు ఇప్పుడు ఐపీఎల్ సిరీస్ లో వివిధ ఆటగాళ్ల బ్యాట్లను ఎందుకు పరిశీలిస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. దీని వల్ల కొన్ని ఐపీఎల్ జట్ల నుంచి ఫిర్యాదులు వచ్చి ఉండవచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. మరింత దూకుడుగా పరుగులు సాధించడానికి బ్యాట్ బరువు పెంచాల్సిన అవసరం ఉన్నందున ఓ ఆటగాడు లేదు జట్టు బ్యాట్ సైజును మార్చి ఉండవచ్చనే సందేహాలు తలెత్తినట్లు సమాచారం.సులభం సిక్సులు కొట్టవచ్చని ఓ నమ్మకం ఉంది. బ్యాట్ ను పట్టుకోవడం కష్టంగా అనిపించినప్పటికీ టీ20 మ్యాచ్ లలో సగటున 30 లేదా 40 బంతులు ఎదుర్కొంటే దూకుడుగా ఉండే బ్యాటర్ బరువైన బ్యాట్ తో ఆడటం సాధ్యమే. దీని ప్రకారం కొంతమంది ఆటగాళ్లు బ్యాట్ పరిమాణాన్ని మార్చి దూకుడుగా ఆడుతున్నారని ఎవరైనా ఫిర్యాదు చేసి ఉండవచ్చనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రతి మ్యాచ్లో అందరి బ్యాటర్ల బ్యాట్లను పరీక్షించడంపై అంపైర్లు అంత శ్రద్ధ చూపలేరు కాబట్టి ఇది ముందు జాగ్రత్త పరీక్ష అని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: Sunil Gavaskar: వినోద్ కాంబ్లీకి ఆర్థిక సాయం ప్రకటించిన సునీల్ గవాస్కర్