ఉక్రెయిన్ యుద్ధం ముగించకుంటే యుక్రెయిన్పై అమెరికా దారి మళ్లింపు.
Ukraine : రష్యా యుద్ధానికి ముగింపు తెచ్చేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇక సమయం తక్కువగా మిగిలిందని, త్వరలోనే తమ దారి తాము చూసుకుంటామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. శుక్రవారం యూరోపియన్, ఉక్రెయిన్ నేతలతో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ప్యారిస్లో చర్చల్లో కీలక మలుపుని సూచిస్తున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు వారాలు, నెలల తరబడి అత్యున్నత స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని రూబియో వివరించారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శాంతి చర్చలు నిరర్థకంగా మారుతున్నాయని, ఇది కొనసాగితే ట్రంప్ తదుపరి చర్యలు తీసుకుంటారని ఆయన సూచించారు. శాంతి కుదిర్చేందుకు ట్రంప్ ఆసక్తిగా ఉన్నప్పటికీ, ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాధాన్యతలు కూడా ఉన్నాయని రూబియో పేర్కొన్నారు.

చర్చలకు గడువు ముగిసిన దశలో
ఇక శాంతి చర్చలకు ఎక్కువ కాలం కేటాయించే అవకాశం లేదని స్పష్టం చేశారు. “ఈ చర్చల్లో పురోగతి కనిపించకపోతే, ట్రంప్ దాన్ని వదిలేసి ముందడుగు వేస్తారు. ఇక నెలలు, వారాల పాటు ప్రయత్నించడం ఉండదు,” అని రూబియో పేర్కొన్నారు. ఉక్రెయిన్ శాంతి ఒప్పందం త్వరలోనే సాధ్యమవుతుందని ట్రంప్ గురువారం చేసిన వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ట్రంప్ తాజాగా ఉక్రెయిన్తో ఖనిజాల ఒప్పందం కూడా చేసుకోవచ్చని ప్రకటించారు. ఇది అమెరికా వ్యూహంలో కొత్త మలుపు అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధం కొనసాగితే, అమెరికా శాంతి చర్చల ప్రయత్నాలను నిలిపివేసి తన దారి తాను చూసుకుంటుందని మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.ఇప్పటి వరకూ అమెరికా శాంతి చర్చల్లో కృషి చేస్తూ వచ్చింది. అయితే, శాంతి ఒప్పందాలు ముందుకు సాగకపోవడం, రష్యా వైఖరిలో మార్పు లేకపోవడం వంటివి అమెరికా కొత్త నిర్ణయాలకే దారితీశాయి. అమెరికా ప్రజలు కూడా ఈ యుద్ధానికి ఆర్థికంగా మద్దతివ్వడం తప్పదన్న ఒత్తిడిలో ఉన్నారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని, ట్రంప్ ప్రభుత్వం తన నయమైన మార్గాన్ని మార్చుకునే అవకాశాలు ఉన్నాయి.
Read More :Elon Musk : పుతిన్ ప్రశంసలు, స్టార్లింక్కు ముప్పు