హాజీపూర్‌లో దారుణం..ఇద్దరు మహిళా కూలీలపై అత్యాచారం

spanish-woman-gangraped-in-jharkhand-dumka

దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. కోర్ట్ లు, పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికి కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రతి రోజు పదుల సంఖ్యలో అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారి సమీపంలోని హాజీపూర్‌లో మద్యం తాగించి.. ఇద్దరు మహిళా కూలీలపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన దారుణం వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..బల్మూర్‌ మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలు అచ్చంపేటకు వచ్చి రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. గురువారం కూడా వారు పని కోసం రాగా.. పట్టణంలో బండల దుకాణాలు నిర్వహించే ఇద్దరు వ్యక్తులు వినోద్‌ సింగ్, గజానంద సింగ్‌ తమ ఇంట్లో పని ఉందని కూలీ మాట్లాడుకొని మహిళలను తీసుకెళ్లారు. ఇంటిని శుభ్రం చేయించుకొని, పని పూర్తయ్యాక మాటల్లో దింపి, మభ్యపెట్టి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇద్దరు మహిళలనూ కారులో ఎక్కించుకుని నల్గొండ జిల్లా డిండి వైపు తీసుకెళ్లి మద్యం తాగించారు.

శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారి సమీపంలోని హాజీపూర్‌ శివారు ప్రాంతంలో కారు నిలిపి మత్తులో ఉన్న మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. తిరిగి సాయంత్రం 6 గంటల సమయంలో అచ్చంపేట శివారులోని క్రీడా మైదానం సమీపంలో మహిళలను వదిలేశారు. అపస్మారక స్థితిలో ఉన్న మహిళలను గమనించిన స్థానికులు డయల్‌ 100, 108లకు సమాచారం ఇచ్చారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రవీందర్‌ పేర్కొన్నారు.