తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణాల అభివృద్ధిలో మరో కీలక మైలురాయి చేరుకుంది. అత్యాధునిక వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలోనే ట్రాక్ పైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ రైళ్లు డే టైమ్ సర్వీసులకే పరిమితమయ్యాయి. అయితే, దూర ప్రయాణాల కోసం స్లీపర్ వందే భారత్ రైళ్లపై ప్రజల డిమాండ్ పెరగడంతో, తొలివిడతగా మొత్తం 9 స్లీపర్ వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. అందులో రెండు రైళ్లు తెలుగు రాష్ట్రాలకు కేటాయించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 5 వందే భారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి.
విజయవాడ నుండి అయోధ్య / వారణాసి మధ్య
ఈ రెండు స్లీపర్ రైళ్లలో ఒకటి విజయవాడ నుండి అయోధ్య / వారణాసి మధ్య నడవనుంది. ఈ రైలు విజయవాడ నుండి వరంగల్ మీదుగా ప్రయాణించనుంది. రాత్రి సమయానికి అనుగుణంగా ఈ రైలు ఉండేలా మార్గ సవరించనున్నారు. ఇక మరో రైలు సికింద్రాబాద్ నుండి తిరుపతికి నడిచేలా ప్రతిపాదనలు ఉన్నాయి. వీటి ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు, ధార్మిక కేంద్రాల మధ్య ప్రయాణం మరింత వేగవంతం, సౌకర్యవంతం కానుంది. ప్రస్తుత మార్గాల్లో ఆక్యుపెన్సీ, డిమాండ్ అధికంగా ఉండటంతో వీటిని మొదటి విడతలోనే అమలు చేయాలని రైల్వే శాఖ ఆలోచిస్తోంది.
ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ, త్రీ టైర్ ఏసీ కోచులు
ఈ స్లీపర్ వందే భారత్ రైళ్లు ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ, త్రీ టైర్ ఏసీ కోచులతో కూడి ఉంటాయి. మొత్తం 1,128 బెర్తులు అందుబాటులో ఉండనున్నాయి. 24 స్లీపర్ వందే భారత్ రైళ్ల కోసం ఇప్పటివరకు ఆర్డర్లు ఇచ్చినట్టు సమాచారం. ప్రయాణికుల రద్దీ, అవసరాలను పరిగణనలోకి తీసుకొని రైల్వే అధికారులు పూర్తి నివేదికను సమర్పించనున్నారు. తుది నిర్ణయం రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకోనుంది కానీ, తొలి విడత కేటాయింపులో తెలుగు రాష్ట్రాలకు ఈ రైళ్లు లభించే అవకాశం ఖాయం అనిపిస్తోంది.
Read Also : TGSRTC: టీజీఎస్ఆర్టీసీలో రూ.20లకే కాంబీ టికెట్