ఏపి, తెలంగాణలో రాష్ట్రాల రైల్వే వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది సరి కొత్త టెక్నాలజీతో రూపు దిద్దుకుంటున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కేందుకు సిద్ధమయ్యాయి. తొలి విడతలో నే ఈ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయించేందుకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో, దూరపు ప్రయాణాల కోసం వందేభారత్ స్లీపర్ ను కేటాయించాలని రెండు రాష్ట్రాల ఎంపీలు రైల్వే శాఖ పైన ఒత్తిడి పెంచుతున్నారు.దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లు ప్రస్తుతం 136 మార్గాల్లో నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయిదు రైళ్లు కొనసాగుతున్నాయి. అయితే, వందేభారత్ స్లీపర్ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. వందేభారత్ స్లీపర్ రైళ్లు తొలి విడతగా 9 సర్వీసులు ప్రారంభించేలా నిర్ణయం చేసారు.వీటికి సంబంధించి రూట్ పైనా స్పష్టత వచ్చింది. ఈ రైళ్లలో ఏసీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీ, ఏసీ త్రీ టైర్ అందుబాటులో ఉంటాయి. మొత్తం 1,128 బెర్తులు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 24 వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం ప్రస్తుతం ఆర్డర్లు ఉన్నాయి.
సూత్ర ప్రాయం
తెలుగు రాష్ట్రాల నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు విజయవాడ నుంచి అయోధ్య / వారణాసి వరకు కేటాయించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే వందే భారత్ స్లీపర్ ను అయోధ్య కు కేటాయించేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. రాత్రి సమయం లోనే ఈ రైలు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ కి వందేభారత్ స్లీపర్ రైలు ప్రతిపాదన పైన తుది కసరత్తు జరుగుతోంది. రైల్వే మంత్రికి నేరుగా ఈ రైలు కేటాయింపు కోసం వినతులు వస్తున్నాయి. అదే విధంగా విశాఖ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు కోసం రైల్వే శాఖకు ప్రతిపాదనలు అందాయి.

అవకాశం
విజయవాడ నుంచి అయోధ్య, అదే విధంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లను తొలి విడతలో కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మార్గా ల్లో రద్దీ ఆక్యుపెన్సీ డిమాండ్ పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం తొలి విడత వందేభారత్ స్లీపర్ పట్టాలెక్కించేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, తొలి విడతలో ఏ మేరకు సాధ్యం అనే అంశం పైన అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. రైల్వే అధికారులు ఈ రెండు ప్రతిపాదనల్లో ప్రయాణీకుల డిమాండ్. రద్దీ గురించి నివేదికలు ఇవ్వనున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే, తొలి విడతలోనే వందేభారత్ స్లీపర్ తెలుగు రాష్ట్రాలకు కేటాయింపు ఖాయంగా కనిపిస్తోంది.
Read Also: Amaravati Relaunch : అమరావతి పైలాన్ ప్రత్యేకతలు తెలుసా..?