తిరుమల రద్దీకి చెక్: అలిపిరి బేస్ క్యాంప్ పై టీటీడీ ఫోకస్
తిరుమల కొండపై భక్తుల రద్దీతో పాటు వాహనాల తీవ్ర రద్దీకి చెక్ పెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యాచరణ ప్రారంభించింది. “టీటీడీ విజన్ 2047″లో భాగంగా, అలిపిరి వద్ద ఆధునిక సదుపాయాలతో కూడిన బేస్ క్యాంప్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. శేషాచల అటవీ ప్రాంతం పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు, తిరుమల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అలిపిరిలోని సప్తగిరి తనిఖీ కేంద్రం ద్వారా రోజూ సుమారు 10,000 వాహనాలు తిరుమల కొండపైకి వెళ్తున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ సమస్య అధికమవడం, శబ్ద కాలుష్యం పెరగడం, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. వాహనాల హారన్ శబ్దాలతో తిరుమల శాంతి భంగమవుతోంది. తిరుమల పుణ్యక్షేత్రంలో గోవింద నామస్మరణ కన్నా వాహనాల హోరు ఎక్కువగా వినిపిస్తుండటంతో, దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని టీటీడీ భావిస్తోంది.
ముంతాజ్ హోటల్ భూమిలో కొత్త అవకాశాలు
అలిపిరి బేస్ క్యాంప్ నిర్మాణానికి అనువుగా ముంతాజ్ హోటల్స్కు కేటాయించబడిన వివాదాస్పద స్థలాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా, టీటీడీకి ఒక గొప్ప అవకాశం లభించింది. ఈ స్థలంలో 15 హెక్టార్ల విస్తీర్ణంలో బేస్ క్యాంప్ నిర్మించాలన్న పక్కా ప్లాన్ సిద్ధమైంది. ఈ క్యాంప్లో పార్కింగ్, వసతి, ఇతర భక్తుల అవసరాలకు తగిన అన్ని సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానుంది. భవిష్యత్తులో భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్న టీటీడీ, తిరుమలలో వసతి సౌకర్యాలు మరింత కష్టంగా మారతాయని ముందుగానే పసిగట్టి ఈ ప్రణాళికలు సిద్ధం చేసింది.
భవిష్యత్తు రద్దీకి ముందస్తు చర్యలు
గత కొన్ని దశాబ్దాల్లో తిరుమల భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 1970లలో సంవత్సరానికి 35 లక్షల భక్తులు మాత్రమే వచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రతిరోజు సగటున 70,000 నుండి 80,000 వరకు భక్తులు దర్శనార్థం వస్తున్నారు. 2024 సంవత్సరానికి ఈ సంఖ్య 2 కోట్ల 55 లక్షల భక్తులకు చేరింది. సెలవు దినాలు, పర్వదినాల్లో ఈ సంఖ్య 90 వేల దాకా పెరుగుతోంది. అయితే తిరుమలలో ఉన్న వసతి సౌకర్యాలు కేవలం 40 వేల మంది భక్తులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే దాదాపు సగానికి పైగా భక్తులకు గది సౌకర్యం అందడం కష్టమవుతోంది. భవిష్యత్తులో తిరుమలలో మరింత గదులు నిర్మించాలంటే అడవులను నరికి కాంక్రీట్ జంగిల్గా మార్చాల్సిన పరిస్థితి వస్తుందని టీటీడీ అంచనా వేసింది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని అలిపిరిలోనే భక్తుల ప్రవాహాన్ని నియంత్రించాలని నిర్ణయించింది.
అలిపిరి బేస్ క్యాంప్ లక్ష్యాలు
అలిపిరి బేస్ క్యాంప్ ద్వారా రోజూ తిరుమలకు చేరే 25,000 మంది భక్తులకు అన్ని రకాల సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో టీటీడీ పని చేస్తోంది. పార్కింగ్, వసతి గదులు, లాకర్లు, భోజన సదుపాయాలు, విశ్రాంతి ప్రాంతాలు వంటి ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తేనుంది. అలాగే కొండపైకి భక్తుల సంఖ్యను నియంత్రించేందుకు అలిపిరిలోనే ముందస్తు స్క్రీనింగ్, టోకెన్లు ఇచ్చే వ్యవస్థను అభివృద్ధి చేయనుంది. పర్యావరణానికి హాని లేకుండా, భక్తుల సౌకర్యాన్ని పెంచే దిశగా టీటీడీ ముందడుగు వేసింది.
READ ALSO: TTD : భవనాన్ని ఖాళీ చేయండి..విశాఖ శారదాపీఠానికి టీటీడీ నోటీసులు