TTD: టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఅర్ నాయుడు తిరుమలలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణం వద్ద కలియతిరిగారు. భక్తులకు అందుతున్న సదుపాయాలు, వసతులు, శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాలు, తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో చేపట్టాల్సిన ఇతర సౌకర్యాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన పలువురు భక్తులను నేరుగా కలుసుకున్నారు. శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని ఆలయం వెలుపలికి వచ్చిన భక్తులతో బీఆర్ నాయుడు మాట్లాడారు.

భక్తుల నుండి ఫీడ్ బ్యాక్
తిరుమలలో అడుగుపెట్టినప్పటి నుంచి శ్రీవారి దర్శనం ముగిసేంత వరకు వారికి అందిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు కల్పించాల్సిన ఇతర వసతులను మరింత మెరుగుపర్చడంపై వారి నుండి ఫీడ్ బ్యాక్ను తీసుకున్నారు. టీటీడీ సాంకేతిక సేవల్లో కొన్ని లోపాలు ఉన్నట్లు కొందరు భక్తులు ఈ సందర్భంగా చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాలు చాలా రుచికరంగా ఉన్నాయంటూ మరికొందరు భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఆలయంలో దర్శన క్యూలైన్లను పరిశీలించిన బీఆర్ నాయుడు
వయోధిక వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్ లైన్ ద్వార దర్శనానికి అనుమతించాలంటూ టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నందుకు కొందరు భక్తులు చైర్మన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. దీనివల్ల వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా శీఘ్రగతిన శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారని అన్నారు. అనంతరం బీఆర్ నాయుడు శ్రీవారి ఆలయంలో దర్శన క్యూలైన్లను పరిశీలించారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కొందరు సిబ్బంది ప్రవర్తనపై ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతిగా ఆయన- భక్తులతో మర్యాదగా, సేవాభావంతో ప్రవర్తించాలని సిబ్బందిని ఆదేశించారు. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
Read Also: జీవిత ఖైదీలకు సర్కార్ గుడ్ న్యూస్