సత్యమే గెలుస్తుంది – కేటీఆర్

ktr comments on congress govt

అధికార దుర్వినియోగం చేసిన వారికి త్వరలోనే ప్రజాకోర్టులో శిక్ష పడుతుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. విద్యుత్ కమిషన్ ఛైర్మన్ను మార్చాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలనుద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. ‘రాజకీయ ప్రతీకారాలకు పరిమితులు ఉంటాయి. బాధితులను ఎక్కువ కాలం బాధించొద్దని సుప్రీం తీర్పు చెబుతోంది. కెసిఆర్ కేసులో అధికార దుర్వినియోగం చేశారని న్యాయస్థానం పేర్కొంది. సత్యమే గెలుస్తుంది’ అని పేర్కొన్నారు. కేసీఆర్‌ మీద అధికార దుర్వినియోగంపై న్యాయస్థానం ప్రతిష్ఠాత్మక తీర్పునిచ్చిందని అన్నారు. త్వరలోనే ప్రజాక్షేత్రంలో కూడా ఇలాంటి తీర్పే రాబోతుందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలకు ఆ దేవుడు కూడా తగిన శిక్ష విధిస్తాడని అభిప్రాయపడ్డారు. సత్యమే ఎల్లప్పుడూ గెలుస్తుందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిపిన విద్యుత్తు కొనుగోళ్లు- కొత్త విద్యుత్కేంద్రాల నిర్మాణంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ విద్యుత్తు విచారణ సంఘం సారథి జస్టిస్‌ నర్సింహారెడ్డి నేతృత్వంలో గత మార్చి 14న ఏకసభ్య విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

నాటి వ్యవహారాలపై వివరణ ఇచ్చేందుకు తన ముందు హాజరు కావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్‌కు కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. అయితే, విచారణ ప్రక్రియ పూర్తి కాకుండానే జస్టిస్‌ నర్సింహారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి, తప్పు జరిగిపోయిందన్నట్టుగా మాట్లాడడం సరికాదని, న్యాయ ప్రాధికార సంస్థ అయిన విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ఆమోదించిన నిర్ణయాల మీద ప్రభుత్వం మళ్లీ విచారణకు ఆదేశించడం చెల్లదని వాదిస్తూ కేసీఆర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.