డొనాల్డ్ ట్రంప్కు సమీపంలో కాల్పులు..
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రిపబ్లిక్ పార్టీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు జరిగాయి. ఫోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లో ఉన్న తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. వెంటనే ట్రంప్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. అయితే కాల్పుల ఘటన అనంతరం ట్రంప్ సురక్షితంగానే ఉన్నారని, ప్రస్తుతానికి ఇంతకన్నా వివరాలేవీ లేవని ఆయన ప్రచార బృందం అధికార ప్రతినిధి స్టీవెన్ చెంగ్ తెలిపారు. ట్రంప్ క్షేమమేనని ఆయన భద్రత వ్యవహారాలు చూసే సీక్రెట్ సర్వీస్ విభాగం కూడా ధ్రువీకరించింది. ట్రంప్ను లక్ష్యంగా చేసుకునే కాల్పులు జరిగాయా అనే కోణంలో విచారణ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు, అతని నుంచి ఏకే 47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారని న్యూయార్క్ పోస్ట్ వార్తా సంస్థ వెల్లడించింది. కాగా, ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా కాల్పుల శబ్ధాలు వినిపించాయని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే కాల్పులకు పాల్పడింది ఒక్కరా లేదా ఇద్దరా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, వారి ఉద్దేశం ఏంటనే విషయం తెలియదని వెల్లడించాయి. ఘటన గురించి అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అధికారులు నివేదించారు. ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్టు కూడా సమాచారం లేదని స్థానిక పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
గోల్ఫ్ ఆడుతుండగా ట్రంప్నకు సమీపంలోనే కాల్పులు జరిగాయని ఆయన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అన్నారు. పొదల్లో ఏకే 47 రైఫిల్ కూడా లభించిందని చెప్పారు. ప్రస్తుతం ట్రంప్ క్షేమంగా ఉన్నారని చెప్పారు. అనుమానితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.