రేవంత్ రెడ్డి అరెస్టు ఓ కొత్త నాటకం
కావాలనే అరెస్టయి జైలుకెళ్లారు: కర్నె ప్రభాకర్
హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి అరెస్టు చర్చనీయాంశంగా మారింది. మంత్రి కెటిఆర్ ఫాంహౌస్లోకి డ్రోన్లను ఎగురవేసిన కేసులో రేవంత్ రెడ్డి అరెస్టయి జైలుకి వెళ్లిన విషయం తెలిసిందే. కాగా ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు టిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై కాంగ్రెస్ పార్టీ నేతలు కుంతియా, ఆజాద్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీకర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. గోపన్ పల్లి భూ ఆక్రమణను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కావాలనే అరస్టయి జైలుకు వెళ్లారని చెప్పారు. ఇతరుల వ్యక్తిగత ప్రాంతాల్లో డ్రోన్లను ఎగురవేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. చట్టాలు తెలిసిన వారు కూడా వాటిని పాటించకపోవడం దురదృష్టకరమని రేవంత్ ను ఉద్దేశించి అన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని చెప్పారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/