కన్వర్‌ యాత్రలో విషాదం..9 మంది భక్తులు మృతి

Tragedy in Kanwar Yatra.. 9 devotees died

పాట్నా: బీహార్‌లోని హాజీపూర్‌లో కావడి యాత్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి హాజీపూర్‌ సమీపంలోని సుల్తాన్‌పూర్‌ వద్ద కన్వర్‌ యాత్రికులు ప్రయాణిస్తున్న డీజే వాహనానికి హైటెన్షన్‌ వైర్‌ తగిలడంతో తొమ్మిది మంది మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతుల్లో ఒక మైనర్ ఉన్నారు. కావడి యాత్రికులు పహెల్జా నుంచి గంగాజలాన్ని తీసుకుని సోన్‌పూర్‌లోని బాబా హరిహరనాథ్‌ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కన్వరియాలు ట్రాలీలో డీజేని తీసుకెళ్తున్నారని, దానికి 11 వేల వోల్టుల విద్యుత్‌ తీగ తగిలిందని స్థానిక ఎస్డీపీవో ఓంప్రకాశ్‌ తెలిపారు. దీంతో వారు విద్యుదాఘాతానికి గురయ్యారని చెప్పారు. ఘటనా స్థలంలోనే ఎనిమిది మంది మరణించారని, మరొకరు దవాఖానలో చనిపోయారని వెల్లడించారు.