సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో కురిసిన భారీ వర్షానికి, ఆలయం వద్ద కొత్తగా నిర్మించిన రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి.
హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఈ ప్రమాదానికి కారణంగా, ఇటీవల నిర్మించిన గోడ నాణ్యత లోపంతో పాటు, వర్షానికి మట్టి నానిపోవడం వల్ల గోడపై ఒత్తిడి పెరిగి కూలిపోయినట్టు అధికారులు తెలిపారు .
బాధ్యులపై చర్యలు
ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదానికి కారణమైన నిర్మాణ లోపాలను గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సింహాచలం ఆలయంలో భక్తుల భద్రతకు మరింత శ్రద్ధ తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు .
Read Also : India -Pakistan War : ఆర్మీకి మోడీ పూర్తి స్వేచ్ఛ..వార్ కు సిద్దమైనట్లే !!