నేడు టీడీపీ తొలి పొలిట్‌ బ్యూరో సమావేశం

Chandrababu

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. దీనికి చంద్రబాబు అధ్యక్షత వహించనున్నారు. నామినేటెడ్ పదవులు, శ్వేత పత్రాలు, సంస్థాగత వ్యవహారాల వంటి ఆరు అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపైనా చర్చిస్తారని సమాచారం. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి పొలిట్ బ్యూరో సమావేశం ఇది.

పొలిట్ బ్యూరో సమావేశం కోసం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. నిర్దేశిత షెడ్యూల్ వల్ల సీఎం ఈ రోజు సందర్శకులను కలిసే సమయం ఉండదని పార్టీ నేతలు వెల్లడించారు. అర్ధం చేసుకుని సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం జరిగే ప్రజా వేదిక కార్యక్రమంలో ప్రజలు తమ వినతి పత్రాలను అందించే వెసులుబాటును వినియోగించుకోవాలని కోరారు. పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో అర్జీలు ఇచ్చేందుకు వచ్చే అవకాశం ఉండటంతో పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు విజ్ఞప్తి చేసింది.