ఇంటర్నేషనల్ ఎర్త్ డేను ఏటా ఏప్రిల్ 22న నిర్వహిస్తారు. 1970లో ఇదే తేదీన అమెరికాలోని భిన్న నగరాల్లో దాదాపు 2 కోట్ల మంది పర్యావరణానికి జరుగుతున్న హానిపై వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఆ ఘటనలను గుర్తుచేయడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చేందుకు ఈ తేదీని ఎర్త్ డేగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఎర్త్ డే సందర్భంగా భూమి గురించి కొన్ని ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం.
భూమి సంపూర్ణ గోళం కాదు
భూమిని మ్యాప్లలో సంపూర్ణ గోళాకారంలో చూపిస్తారు. కానీ, అది నిజంకాదు. ధ్రువాల దగ్గర భూమి కాస్త సమతలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కాస్త సమతలంగా కనిపించే గోళంగా చెప్పుకోవచ్చు. ఇతర గ్రహాల తరహాలోనే సూర్యుడి చుట్టూ కక్ష్యలో తిరగడం వల్ల భూమిపై కూడా గురుత్వాకర్షణ శక్తి, అపకేంద్ర బలం (సెంట్రీఫ్యూగల్ ఫోర్స్) గట్టిగా పనిచేస్తాయి. దీని వల్ల ధ్రువాలు కాస్త సమతలంగా ఉండటంతోపాటు భూమధ్య రేఖ వద్ద వ్యాసం ఎక్కువగా ఉంటుంది.

భూమిపై 70 శాతం ఉండేది నీరే..
భూమిపై నీరు ఘన , ద్రవ, వాయు రూపాల్లో ఉంటుంది. భూమిపై దాదాపు నాలుగింట మూడొంతులు ఉండేది నీరే. హిమానీనదాలు (గ్లేసియర్లు), చిత్తడినేలలు, సరస్సులు, నదులు, సముద్రాలు, మహా సముద్రాల రూపంలో ఈ నీరు ఉంటుంది. భూమి నుంచి 100 కి.మీ. ఎత్తులో అంతరిక్షం, భూమి వాతావరణం, అంతరిక్షాల మధ్య రేఖను కర్మన్ రేఖగా పిలుస్తారు. సముద్ర తలం నుంచి వంద కి.మీ. ఎత్తులో ఇది మొదలవుతుంది. మన విశ్వంలో జీవం ఉన్నట్లు నిర్ధరించగలిగిన ఏకైక గ్రహం భూమి. ప్రస్తుతం దాదాపు 12 లక్షల జంతువులను పరిశోధకులు గుర్తించారు. అయితే, మొత్తం జంతు జాలంలో ఇవి చాలా తక్కువ శాతమని భావిస్తున్నారు. సుమారు 450 కోట్ల ఏళ్ల కిందట భూమి ఏర్పడింది.
Read Also: కొత్త పోప్ ఎన్నిక కోసం కీలకమైన ప్రక్రియ