నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు పై విచారణ

Supreme Court

న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. అయితే, కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి , బీఆర్ఎస్ నాయకులు ట్రాన్స్‌ఫర్ పిటిషన్‌ను దాఖలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై నేడు జస్టిస్ బీఆర్ గవాయ్ , జస్టిస్ కేవీ విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కాగా, తెలంగాణ ఎమ్మెల్యేల కోటా ఎమ్మె్ల్సీ ఎన్నికల సందర్భగా నామినేటెడ్ ఎమ్మెల్యే ను కొనేందుకు నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముడుపులు ఇచ్చేందుకు ప్రయత్నించారని ఏసీబీ కేసు నమోదు చేసింది.

అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు తో రేవంత్‌రెడ్డి కాల్ రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చాయి. అదేవిధంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ నివాసంలో నగదుతో కూడిన బ్యాగ్‌తో రేవంత్‌రెడ్డి భేటీ అయిన వీడియో ఫుటేజ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆ కేసులో రేవంత్‌రెడ్డి జైలుకు కూడా వెళ్లివచ్చారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఓటుకు నోటు కేసు విచారణ హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌ కు మార్చాలని సుప్రీం కోర్టులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో సహా రేవంత్ రెడ్డి, ప్రతివాదులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.