అమరావతి: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగాలి. అందుకు ఎస్వీయూ సెనేట్ హాలులో ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్ ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ, కోరం లేకపోవడంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి, జేసీ శుభం బన్సల్ ప్రకటించారు. 47 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్అఫిషియో సభ్యులున్నారు. 22 మంది మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. 50 శాతం కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా అనివార్యమైంది.
కాగా, తిరుపతి డ్యిపూటి మేయర్ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్లు 22 మంది కూటమికి మద్దతు తెలిపారని, మరో 6 మంది రేపు ఉదయం వస్తారని జనసేన నేత కిరణ్ రాయల్ తెలిపారు. సోమవారం ఉదయం జరిగిన నాటకీయ పరిణామాలు అందరూ చూశారు. తమ కార్పొరేటర్లను వైసీపీ వాళ్లే కిడ్నాప్ చేయించుకొని కూటమి ప్రభుత్వంపై నింద మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదయం మిస్సయిన నలుగురు కార్పొరేటర్లు తాము సురక్షితంగా ఉన్నామని వారే వీడియో ద్వారా తెలిపారు. ఎన్నిక గందరగోళం వల్ల తాము సురక్షిత ప్రాంతానికి వచ్చేశామని వారే చెప్పారు.

భూమన కరుణాకరరెడ్డి గతంలో ఎన్నో అరాచకాలు చేయగా తిరుపతి ప్రజలందరూ చూశారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం కరుణాకరరెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడ్డారు. గతంలో జరిగిన ఎన్నికల్లో వైసిపి అనేక అరాచకాలకు పాల్పడింది. దొంగ ఓటరు కార్డులు తయారు చేయించి తమిళనాడు నుంచి వ్యక్తులను ఇక్కడికి తరలించి దొంగ ఓట్లు వేయించారు. మేం ఎలాంటి దౌర్జన్యాలకు, కిడ్నాప్లకు పాల్పడలేదు. తిరుపతి డ్యిపూటి మేయర్ ఎన్నిక మంగళవారం ప్రశాంత వాతావరణంలో జరగాలి. తన కొడుకు భూమన అభినయ్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం కరుణాకర్ రెడ్డి ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడ్డుతున్నారని’ కిరణ్ రాయల్ మండిపడ్డారు.