నెల రోజుల పాటు తిరుమల పుష్కరిణి మూసివేత

తిరుమల శ్రీవారి పుష్కరిణిని ఎల్లుండి నుంచి నెల రోజుల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, ఇతర పనులు కారణంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులు.. స్వామి వారి దర్శనానికి ముందు శ్రీవారి పుష్కరిణిలో (కోనేరు) స్నానం చేయడం ఆనవాయితీ. తలనీలాలు సమర్పించిన భక్తులతో పాటుగా ఇతర భక్తులు కూడా కోనేట్లో స్నానం చేసి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి నెల రోజుల పాటు మీకు ఆ భాగ్యం దక్కకపోవచ్చు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణిని ఆగస్ట్ 1 నుంచి 31వ తేదీ వరకూ మూసివేయనున్నారు.

ఈ నెల రోజుల పాటు శ్రీవారి భక్తులకు కోనేట్లో స్నానం చేసేందుకు వీలుండదు. ఈ విషయాన్ని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంకో రెండు నెలల్లో శ్రీవారికి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు జరుగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పుష్క‌రిణి వార్షిక నిర్వహణా పనులను చేపట్టడానికి పుష్కరిణిని నెల రోజుల పాటు మూసి వేయాలని నిర్ణయించారు. ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణి మూత పడనుంది. దీనితో పాటు నెల రోజుల పాటు పుష్క‌రిణి హార‌తి కార్యక్రమాన్ని రద్దు చేశారు. మొదట ప‌ది రోజుల పాటు నీటిని తోడి వేస్తారు. ఆ త‌రువాత ప‌ది రోజులు మ‌ర‌మ్మ‌తులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివ‌రి ప‌ది రోజులు పుష్క‌రిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్క‌రిణిలోని నీటి పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ విలువ 7 ఉండేలా చూస్తారు. పీహెచ్ 7 అనేది నీరు ఎంత శుద్ధంగా ఉంటుందనేది తెలియజేస్తుంది. టీటీడీ వాట‌ర్ వ‌ర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగనున్నాయి.