వేసవి సెలవుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాల్లో భక్తుల రద్దీ పెరిగింది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వేలాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానము (TTD) ఇప్పటికే పలు కీలక భద్రతా ఏర్పాట్లు చేసింది. సాధారణ భక్తులకు విఘాతం కలగకుండా ఉండేందుకు బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మాత్రమే పరిమిత అవకాశాలు కల్పిస్తూ, భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఏరియా డామినేషన్ ఆపరేషన్
ఏరియా డామినేషన్ ఆపరేషన్ సింధూర్ వేళ తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేసారు. అందులో భాగంగా 130 మంది ఆక్టోపస్, పోలీసు, నిఘా మరియు భద్రత విభాగం, బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి ఏరియా డామినేషన్ నిర్వహించారు. భారత్-పాక్ వార్ నేపథ్యంలో భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా ముందస్తు జాగ్రత్తగా ఏరియా డామినేషన్ నిర్వహించిన సిబ్బంది తిరుమలలో శ్రీవారి ఆలయం, కాటేజీలు, బస్టాండ్ వంటి రద్దీ ప్రాతాల్లో తనిఖీలు కొనసా గించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీలు చేసారు. ఈ తరహా తనిఖీలతో భక్తులకు భరోసా నింపటమే తమ లక్ష్యమని అధికారులు ప్రకటించారు.
డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ
ఇక ప్రతీ రోజూ తిరుమలలో ఇప్పటి నుండి ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా వుందో దుండగులకు ఒక హెచ్చరిక లాగా ఈ తరహా కార్యక్రమాలు కొనసాగిస్తామని డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. శ్రీవారి వారి భక్తులకు భరోసా లాగా సందేశం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందులో ఆక్టోపస్, పోలీస్, టిటిడి నిఘా మరియు భద్రత సిబ్బంది పాల్గొంటున్నట్లు చెప్పారు. ఏరియా డామినేషన్ భద్రత సిబ్బంది నాలుగు గ్రూపులుగా విడిపోయి సిఆర్ఓ మరియు ఆర్ టిసి బస్టాండ్, శ్రీవారి ఆలయం, నందకం పరిసర ప్రాంతాలు, ఎంబిసి మరియు శ్రీవారి మెట్టు తదితర ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ఈ చర్యలు భరోసా కల్పించడమే లక్ష్యంగా చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
తిరుపతి విమానాశ్రయంలో హై అలర్ట్
భారత్-పాక్ ఉద్రిక్తతలు కేవలం భూభాగపు సరిహద్దులకే పరిమితంగా లేకుండా, విమానాశ్రయాల భద్రతను కూడా ప్రభావితం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన విమానాశ్రయాలకు కేంద్రం హై అలర్ట్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా తిరుపతి విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లు మరింత కఠినంగా మారాయి. దీంతో, తిరుపతి విమానాశ్రయం అధికారులతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎయిర్పోర్ట్ భద్రత పై సమీక్ష చేశారు. ప్రతి ప్రయాణికుడ్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాలని ఆదేశించారు. అనుమానిత వస్తువులు, ప్రయాణికుల లగేజీ ని డాగ్ స్క్వాడ్ తో తనిఖీ చేసి అనుమతించాలని విమానాశ్రయ భద్రత సిబ్బందికి సూచించారు. సిఐఎస్ఎఫ్, ఆక్టోపస్, జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొనగా ఈ మేరకు భద్రతా చర్యలపై జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ సమర్థవంతంగా సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
Read also: Pawan Kalyan : భారత సైన్యంకి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక పిలుపు