రైలులో అగ్ని ప్రమాదమంటూ వదంతి.. కిందకు దూకడంతో ముగ్గురు మృతి

ఝార్ఖండ్లో ముగ్గురు రైలు ప్రయాణికులు అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయారు. రాంచీ-ససారం ఎక్స్‌ప్రెస్‌ ధన్‌బాద్‌ డివిజన్‌లోని కుమందిహ్‌ రైల్వే స్టేషన్‌ వద్దకు చేరుకున్న సమయంలో రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుందని కొందరు వదంతి పుట్టించారు. దీంతో ప్రాణభయంతో పలువురు కిందకు దూకేశారు. అదే సమయంలో పక్కనున్న పట్టాలపై గూడ్సు రైలు రావడంతో దాని కింద నలిగి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఆ ప్రాంతంలో మావో ప్రాబల్యం ఉండటంతో వదంతి వెనుక ఉగ్రవాద కోణంపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఈ ఘటన శుక్రవారం రాత్రి 8 గంటలకు జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. రైలులో అగ్నిప్రమాదం జరిగినట్టు గుర్తు తెలియన వ్యక్తి నుంచి కుమందిహ్‌ స్టేషన్‌కు ఫోన్‌ వచ్చిందని ధన్‌బాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ తెలిపారు. దీంతో రైలును ఆపి తనిఖీ చేయగా, ఎలాంటి ప్రమాదం జరగలేదని, కేవలం వదంతి మాత్రమేని తెలిసిందన్నారు.