ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది విశాఖపట్నంలో మహిళా ఉద్యోగుల కోసం సరికొత్త ఆలోచన చేసింది. నగరంలో మూడు చోట్ల మహిళా ఉద్యోగుల కోసం వసతి గృహాలు (హాస్టల్స్) నిర్మించడానికి పరిపాలన అనుమతులిచ్చింది. రూ.172 కోట్లతో ఈ మూడు హాస్టల్స్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ముడసర్లోవలో రూ.90.54 కోట్లు, మధురవాడలో రూ.51.08 కోట్లు, నరవలో రూ.30.38 కోట్లతో నిర్మాణం చేస్తారు. ఈ హాస్టల్స్లో అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఫుడ్ కోర్టు, వినోద, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, వాహనాల పార్కింగ్ ఇలా అన్ని రకాల సదుపాయాలతో హాస్టల్స్ నిర్మించనున్నారు.కేంద్రం సహకారంతో (ప్రత్యేక మూలధన పెట్టుబడి పథకం) ఈ హాస్టల్స్ నిర్మాణాలకు నిధులు కేటాయించారు. ఈ హాస్టల్స్ నిర్వహణను పీపీపీ విధానం కింద చేపట్టాల్సి ఉంది. ఈ హాస్టల్స్ను గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. ఈ హాస్టల్స్కు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) ఎండీని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్కుమార్ ఆదేశించారు. విశాఖపట్నంలోని మూడు ప్రాంతాల్లో నిర్మించే ‘వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్’ నిర్మాణానికి పరిపాలన పరమైన అనుమతులు ఇస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు.

ప్రభుత్వం
విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఎంతో ఉపయోగంగా ఉంటాయంటున్నారు. విశాఖపట్నానికి పలు ఐటీ కంపెనీలు, పరిశ్రమలు వస్తున్నాయి. ఈ క్రమంలో నగరానికి మన రాష్ట్రంతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మహిళా ఉద్యోగులు వసతి కోసం బయట రూమ్లు, ప్రైవేట్ హాస్టల్స్ను వెతుక్కోవాల్సి వస్తుంది.ఆర్థికంగా కూడా భారంగా మారింది. అదే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అందుబాటులోకి వస్తే తక్కువ ఖర్చుతో హాస్టల్స్లో ఉండొచ్చు. హాస్టల్స్ వెతుక్కునే ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే ఈ హాస్టల్స్ నిర్మాణాలను చేపట్టే అవకాశం ఉందంటున్నారు. వీటి నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం వచ్చే మహిళా ఉద్యోగుల కోసం వసతి ఏర్పాట్లు చేసే పనిలో ఉంది.