ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి సంబంధించి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తరఫున పాకా వెంకట సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. నామినేషన్ గడువు ముగియబోతున్న వేళ అభ్యర్థి ఎంపికపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొనగా, చివరికి బీజేపీ అధిష్ఠానం అనుభవజ్ఞుడైన పాకా వెంకట సత్యనారాయణకే అవకాశమిచ్చింది.
Read Also : AP Government: ఏపీలో నామినేటెడ్ పోస్టులు భర్తీ
బీజేపీలో ఉన్న సీనియర్ నేతకు అవకాశం
పాకా సత్యనారాయణ బీజేపీలో నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్న సీనియర్ నేత. ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది. పార్టీలో వివిధ స్థాయిల్లో కీలక పదవులు నిర్వర్తించిన ఆయన ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నారు. గతంలో కూడా రాష్ట్ర అధ్యక్ష పదవికి, ఎమ్మెల్సీ టికెట్కి పాకా పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ ఈసారి మాత్రం ఆయనకు రాజ్యసభ టికెట్ లభించింది. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి యూరప్ పర్యటనలో ఉన్నప్పటికీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన చర్చలో ఆయన పేరు ఖరారైంది.
అనూహ్యంగా లభించిన అవకాశంపై పార్టీ శ్రేణుల్లో ఆనందం
ఇటీవల అనేక పేర్లు ప్రచారంలో ఉన్నా, చివరకు పార్టీకి చిరకాలంగా సేవలందించిన స్థానిక నేతకే అవకాశం ఇవ్వడం బీజేపీ ఆలోచనను ప్రతిబింబిస్తుంది. తమిళనాడు బీజేపీ నేత అన్నామలై, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ వంటి ప్రముఖుల పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ, పాకా వెంకట సత్యనారాయణ ఎంపికతో ఆశ్చర్యం కలిగించింది. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పైకి వచ్చి పార్టీ నమ్మకాన్ని గెలుచుకున్న ఆయనకు ఈ అవకాశం లభించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షాతిరేకం నెలకొంది. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.