విద్యుత్‌ ఒప్పందాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు – మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

విద్యుత్‌ ఒప్పందాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని , విద్యుత్ కొనుగోళ్లలో కేసీఆర్ చేసింది 100శాతం కరెక్ట్ అని తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణభవన్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘విద్యుత్‌ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఎంక్వయిరీ కమిషన్‌ వేసింది. గత ప్రభుత్వ చేసుకున్న ఒప్పందాలపై విచారణ చేస్తున్నది. ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలకు అసెంబ్లీలో సమాధానం కూడా ఇచ్చాం. శ్వేత పత్రాలు కూడా విడుదల చేశాం’ అని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారంపై కమిషన్‌ వేసిందని విమర్శించారు. ఆ కమిషన్‌కు కేసీఆర్‌ నిన్న రాసిన 12 పేజీల సుదీర్ఘ లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు. విద్యుత్తు కొనుగోళ్లపై సమగ్ర విచారణ చేయాలని అసెంబ్లీ సాక్షిగా తామే డిమాండ్‌ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకృష్ణ కమిటీ 8వ చాఫ్టర్‌ను బయటపెట్టిన తెలంగాణ బిడ్డగా జస్టిస్‌ నర్సింహారెడ్డి అంటే తమకు వ్యక్తిగతంగా గౌరవం ఉన్నదని పేర్కొన్నారు. ఈ నెల 11న విలేకరుల సమావేశంలో తమ ప్రభుత్వాన్ని నిందించే విధంగా జస్టిస్‌ నర్సింహారెడ్డి వ్యాఖ్యలు చేశారని, ఇరువర్గాల అభిప్రాయాలను వినకముందే పీపీఏల్లో అవకతవకలు జరిగాయని రాజకీయ పార్టీ నాయకుల్లాగా మాట్లాడటాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు.