దేశ రక్షణ, భద్రతా దళాల కార్యకలాపాలకు సంబంధించిన వార్తల ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం (Central Governament) కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటువంటి సున్నితమైన అంశాల ప్రత్యక్ష ప్రసారాలు, ‘సన్నిహిత వర్గాల సమాచారం’ అంటూ రాసే కథనాల విషయంలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీడియా సంస్థలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అన్ని మీడియా ఛానెళ్లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా (Social Media) వినియోగదారులకు ఒక సలహా ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు గత నెలలో విడుదల చేసిన మార్గదర్శకాలను పునరుద్ఘాటించింది.

సమస్యాత్మక సమాచారం చెప్పవద్దు
జాతీయ భద్రత దృష్ట్యా, రక్షణ కార్యకలాపాలు లేదా భద్రతా దళాల కదలికలకు సంబంధించి ఎలాంటి రియల్ టైమ్ కవరేజీ, (Real Time Coverage)దృశ్యాల ప్రసారం లేదా ‘సన్నిహిత వర్గాల సమాచారం’ ఆధారిత వార్తలను ప్రచురించవద్దని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సమస్యాత్మక సమాచారం ముందుగానే బయటకు పొక్కితే, అది శత్రు మూకలకు అనుకూలంగా మారే ప్రమాదం ఉందని, తద్వారా సైనిక చర్యల సమర్థతకు, సిబ్బంది భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
గతంలో ప్రతికూల పరిణామాలు ఎదురయ్యాయి
గతంలో కార్గిల్ యుద్ధం, ముంబై ఉగ్రదాడులు (26/11), కాందహార్ విమాన హైజాక్ వంటి సంఘటనల సమయంలో మీడియా కవరేజీ వల్ల జాతీయ ప్రయోజనాలకు అనుకోని ప్రతికూల పరిణామాలు ఎదురయ్యాయని కేంద్రం గుర్తుచేసింది. జాతీయ భద్రతను కాపాడటంలో మీడియా, డిజిటల్ వేదికలు, వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తారని, చట్టపరమైన బాధ్యతలతో పాటు, మనందరి చర్యలు కొనసాగుతున్న ఆపరేషన్లకు లేదా మన బలగాల భద్రతకు ఆటంకం కలిగించకుండా చూడటం నైతిక బాధ్యత అని పేర్కొంది.
ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతి లేదు
కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ (సవరణ) నిబంధనలు, 2021లోని రూల్ 6(1)(p)ని అన్ని టీవీ ఛానెళ్లు తప్పనిసరిగా పాటించాలని గతంలోనే సూచించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిబంధన ప్రకారం, “భద్రతా దళాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నప్పుడు, ఆ ఆపరేషన్ పూర్తయ్యే వరకు ప్రభుత్వం నియమించిన అధికారి ఇచ్చే నిర్దిష్ట వ్యవధుల్లోని సమాచారాన్ని మాత్రమే ప్రసారం చేయాలి, ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతి లేదు” అని స్పష్టం చేసింది.
ఇటువంటి ప్రసారాలు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ (సవరణ) నిబంధనలు, 2021కి విరుద్ధమని, అలాంటి వాటిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. అందువల్ల, జాతీయ భద్రత దృష్ట్యా అన్ని టీవీ ఛానెళ్లు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, భద్రతా దళాల కదలికలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను చేయవద్దని సూచించింది. ఆయా కార్యకలాపాలు ముగిసే వరకు ప్రభుత్వం నియమించిన అధికారి ద్వారా ఎప్పటికప్పుడు అందించే సమాచారానికే మీడియా పరిమితం కావాలని కోరింది.
Read Also: America reprimands Pakistan: పాకిస్థాన్ ను గట్టిగా మందలించిన అమెరికా