దేశానికి మూడోసారి సేవచేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రజలకు ధన్యవాదాలు – మోడీ

దేశానికి మూడోసారి సేవచేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోడీ. 18వ లోక్‌స‌భ తొలి సమావేశాలు సోమ‌వారం ప్రారంభం అయ్యాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులంతా పార్లమెంట్‌ భవనానికి వ‌చ్చారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేప‌ట్టిన‌ నరేంద్ర మోదీ పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప‌లు అంశాల‌ను వెల్ల‌డించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతాభినందనలు. కొత్త పార్లమెంటులో 18వ లోక్‌సభ సమావేశమవుతోంది. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కృషి చేయాలి. 2047 వికసిత్‌ భారత్‌ సంకల్పం, లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా సాగుతాం. కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకుసాగుదాం. మూడోసారి సేవచేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించారు. సభ్యులందరినీ కలుపుకొని వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకుంటాం. ప్రజలు మా విధానాలను విశ్వసించారు’ అని ప్రధాని మోడీ అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.

ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ నిర్వహించాం. 65 కోట్ల మంది ఓటర్లు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. మా విధానాలకు, అంకితభావానికి జనామోదం లభించింది. ప్రజలు మాకు వరుసగా మూడోసారి సేవచేసే అవకాశం కల్పించారు. ఇది చాలా పవిత్రమైన రోజు. కొత్త సభ్యులకు స్వాగతం. కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలి. అందరి సహకారంతో భరతమాత సేవలో పాల్గొంటాం. కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలి అని తెలిపారు.