మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
మహిళా కమిషన్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరయ్యారు. పార్టీ మహిళా నేతలతో కలిసి తెలంగాణ భవన్ నుంచి బయల్దేరిన కేటీఆర్.. ట్యాంక్బండ్లోని బుద్ధభవన్లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కేటీఆర్ను మాత్రమే ఆఫీస్లోకి అనుమతించిన పోలీసులు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు, నాయకులను అడ్డుకున్నారు.
దీంతో వారు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే అదేసమయంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకొని కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. దీంతో ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ఒకరినొకరు తోసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వారిని అదుపుచేయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు బైఠాయించారు. మహిళలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.