అమర్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక విరామం

Temporary break in Amarnath Yatra

శ్రీనగర్‌ః భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు శనివారం ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేసినట్టు స్పష్టం చేశారు. బాల్తాల్, పహల్గాం మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో యాత్రికుల భద్రత నిమిత్తం ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు.

ఇవాళ (శనివారం) భారీ వర్షాలు పడే అవకాశం లేదని, అయితే అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అప్రమత్తతలో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అమర్‌నాథ్ ఆలయ గుహ, శేషనాగ్ శిఖరం వద్ద ఉష్ణోగ్రత గరిష్ఠంగా 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, ఇక రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక రాగల 4 రోజులలో పెద్ద వర్షపాతం ఉండదని, అయితే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

కాగా 3,800 మీటర్ల ఎత్తులో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఈ ఏడాది కూడా పోటెత్తుతున్నారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభమవగా ఇప్పటివరకు 1.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని అంచనాగా ఉంది. ఇక ఆగస్టు 19న యాత్ర ముగుస్తుంది. కాగా గతేడాది మొత్తం 4.5 లక్షల మంది యాత్రికులు శివలింగాన్ని దర్శించుకున్నారు.