Telangana : ఉపాధి హామీ పనిదినాల్లో కోత: కూలీలకు తీవ్ర అన్యాయం – చిన్నారెడ్డి ఆవేదన
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) పనిదినాల్లో కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించడం కూలీ వర్గాలకు తీరని అన్యాయంగా మారిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్రం ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి కేవలం 6.5 కోట్ల పనిదినాలు మాత్రమే మంజూరు చేయడం వల్ల లక్షలాది మంది కూలీలు ఉపాధి కోల్పోయే పరిస్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రభుత్వం 12 కోట్ల పనిదినాల కోసం ప్రతిపాదనలు పంపినా, కేంద్రం దాన్ని పట్టించుకోకుండా సగం మాత్రమే మంజూరు చేయడం వల్ల గ్రామీణ అభివృద్ధి కూడా నెమ్మదించినట్లు చెప్పారు. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాక, సామాజిక సమస్య కూడా అవుతుందని, పల్లెల్లో ఉపాధిలేక వలసలు పెరుగుతున్నాయని చిన్నారెడ్డి చెప్పారు.కేంద్రం రాజకీయ కక్షతోనే తెలంగాణపై అక్కసు తీర్చుకుంటోందని ఆయన ఆరోపించారు. ఉపాధి హామీ పథకం ద్వారా పూట గడిపే కూలీల జీవితాలతో ఈ విధంగా చెలగాటం ఆడటం తీవ్రంగా ఖండించతగినదని అన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోందని, ప్రతి ఏడాది లక్షల మందికి ఉపాధి లభించేదని చెప్పారు.

ఉపాధి కోత వల్ల గ్రామీణ జీవనంపై తీవ్ర ప్రభావం
2004లో యూపీఏ ప్రభుత్వ హయాంలో, వర్షాభావ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అనంతపురం జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి కాలాన్ని గుర్తు చేశారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం — ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఉపాధి హామీ పథకానికి శ్రద్ధగా పని చేసిందని తెలిపారు.ఇప్పటి పరిస్థితుల్లో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెంటనే కేంద్రంతో మాట్లాడి అన్యాయాన్ని నివారించే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తక్షణమే రాష్ట్రానికి అదనంగా 5.5 కోట్ల పనిదినాలు మంజూరు చేసి మొత్తం 12 కోట్ల పనిదినాలు కల్పించాలని, గ్రామీణ జీవనోపాధి భద్రతకు అండగా నిలవాలని చిన్నారెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
Read More : Pakishtan: అణ్వాయుధాల రేసులో పాకిస్తాన్ని దాటేసిన భారత్..