Telangana : టోక్యో, ప్రభాతవార్త: జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం గురించి వివరించిన ఆహ్వానం శుక్రవారం టోక్యోలోని హోటల్ ఇంపీరియల్లో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్టనర్షిప్ రోడ్షోలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలంగాణ అధికార బృందం వివరించింది.సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “జపాన్ పారిశ్రామికవేత్తలందరికి తెలంగాణ రాష్ట్రం హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ. మేము ‘తెలంగాణ రైజింగ్’ నినాదంతో ముందుకు సాగుతున్నాం,” అని తెలిపారు. అలాగే టోక్యో నగరం నుంచి ఎంతో నేర్చుకున్నానని, హైదరాబాద్ అభివృద్ధికి టోక్యో మోడల్ ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల ప్రతిభ, స్థిరమైన పాలన విధానాలు తమ ప్రభుత్వం అందిస్తోందని స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్స్టైల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని జపాన్ కంపెనీలను ఆహ్వానించారు.

ఈ సందర్భంగా భారత రాయబారి సిబి జార్జ్ మాట్లాడుతూ భారత్-జపాన్ మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాలను ప్రస్తావించారు. జెట్రో బెంగళూరు డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుటానీ కూడా తెలంగాణతో వ్యాపార సహకారం మరింత బలపడాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రచార వీడియోలను వేదికపై ప్రదర్శించింది. హైదరాబాద్లో దేశంలోని మొట్టమొదటి నెట్-జీరో ఇండస్ట్రియల్ సిటీ నిర్మాణం చేపడుతున్నట్లు తెలియజేశారు.వాణిజ్య మరియు పరిశ్రమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ జపాన్ కంపెనీలకు తెలంగాణలోని అనుకూల వాతావరణం గురించి వివరించారు. రోడ్షో అనంతరం తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్లోని ప్రముఖ కంపెనీలతో ప్రత్యేకంగా సమావేశమైంది. వివిధ రంగాలలో పెట్టుబడులకు వీలు ఉన్న అవకాశాలను ఈ భేటీలో చర్చించారు.
Read More : Elon Musk : పుతిన్ ప్రశంసలు, స్టార్లింక్కు ముప్పు