Telangana :పెట్టుబడులకు హబ్గా మారుతోంది: ఒసాకా ఎక్స్పో వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ వ్యాపారవేత్తలకు ఆహ్వానం
తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన కృషి అంతర్జాతీయ వేదికలకూ విస్తరించింది. జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ ఎక్స్పోలో పాల్గొన్న ఆయన, తెలంగాణ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానమని ప్రపంచానికి చాటిచెప్పారు. తెలంగాణ “రైజింగ్” పేరుతో ప్రత్యేక ప్రతినిధి బృందం ఈ ఎక్స్పోలో పాల్గొని వివిధ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలతో సమావేశమైంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ ద్వారా రాష్ట్ర సాంకేతికత, పారిశ్రామిక ప్రగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక ఆకర్షణలు విశ్వస్థాయిలో ప్రజెంటేషన్ ఇచ్చారు.ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ పాల్గొనడం గర్వకారణంగా ఉందని సీఎం పేర్కొన్నారు. జపాన్తో చారిత్రకంగా ఉన్న స్నేహాన్ని దీర్ఘకాలిక భాగస్వామ్యంలోకి తీసుకువెళ్లేందుకు ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఐటీ, బయోటెక్నాలజీ, టెక్స్టైల్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను వివరించారు. హైదరాబాద్లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్ (RRR), ఔటర్ రింగ్ రోడ్ (ORR), డ్రైపోర్ట్ ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలు ముఖ్యంగా హైలైట్ చేశారు.

జపాన్లో తెలంగాణ పెట్టుబడులకు కొత్త దిశ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం
జపాన్కు చెందిన మారుబెని కార్పొరేషన్ తెలంగాణలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. అలాగే, ముసీ నది పునరుజ్జీవనంలో భాగంగా 55 కిలోమీటర్ల అర్బన్ గ్రీన్వే అభివృద్ధికి టోక్యో, ఒసాకా నగరాల నుంచి ప్రేరణ పొందుతున్నట్టు చెప్పారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు.ఒసాకా ఎక్స్పో వేదికగా Telangana రాష్ట్రం తన వైవిధ్యభరితమైన అభివృద్ధి, సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా, పెట్టుబడుల ఆకర్షణకు కేంద్రంగా ఎదుగుతున్నదని ఈ కార్యక్రమం స్పష్టంగా తెలియజేస్తోంది. “నవ ప్రపంచాన్ని నిర్మిద్దాం” అనే నినాదంతో Telangana పెట్టుబడిదారులకు కొత్త అవకాశాల ద్వారాన్ని తెరిచినట్లు ముఖ్యమంత్రి అన్నారు.
Read More :Shock for Trump : కోర్టుకెక్కిన హార్వర్డ్ యూనివర్సిటీ