KTR : ఫామ్ హౌజ్ కూల్చొద్దంటూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చేస్తు వస్తుంది. ఈ క్రమంలో కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా కూల్చేస్తారనే వార్తలు ఉపంచుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 111 జీవోను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన జన్వాడ ఫామ్ హౌస్ ను సైతం కూల్చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా ఫామ్ హౌస్ పై అందిన ఫిర్యాదులపై ఆయా ఫామ్ హౌస్ నిర్మాణాల కోసం ఏ ఏ శాఖల నుంచి అనుమతులు ఇచ్చారనే కోణంలో హైడ్రా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అప్పట్లో అధికారులు ఇచ్చిన అనుమతుల మేరకే నిర్మాణాలు జరిగాయా? లేకపోతే జీవో 111 ను ఉల్లంఘించారా? అనే కోణంలో హైడ్రా అధికారులు హెచ్ఎండీఏ, పీసీబీ, ఇరిగేషన్ శాఖల నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టిన ఫామ్ హౌస్ ను నేలమట్టం చేస్తామని హైడ్రా అధికారులు తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ జన్వాడ ఫామ్‌ హౌజ్ రగడ హైకోర్టుకు చేరుకుంది. జన్వాడ ఫామ్ హౌజ్ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. రియల్టర్ ప్రదీప్ రెడ్డి ‍హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే FTL పరిధిలో ఉన్న కట్టడాలపై హైడ్రా కొరడా ఝులిపించింది. జన్వాడ ఫామ్ హౌజ్ FTL పరిధిలో ఉండటం.. కూల్చివేసే అవకాశం ఉండటంతో ముందస్తుగా ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.