తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలోని గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను టీజీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. పేపర్ 1( జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్) పరీక్షను డిసెంబర్ 15వ తేదీ మొదటి సెషన్లో, పేపర్ 2 ( హిస్టరీ, పాలిటీ, సొసైటీ) పరీక్షను రెండో సెషన్లో నిర్వహించనున్నారు. పేపర్ 3 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్) పరీక్షను 16వ తేదీ మొదటి సెషన్లో, పేపర్ 4 ( తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర అవతరణ) రెండో సెషన్లో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, రెండో సెషన్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
కాగా, ఆగస్టు 7, 8వ తేదీల్లోనే గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షల మధ్య వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వారి డిమాండ్కు తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. తాజాగా ఇప్పుడు పరీక్ష షెడ్యూల్ను టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 783 పోస్టుల భర్తీకి గ్రూప్2 పరీక్ష జరగనుంది.