సింగరేణి కార్మికులకు బోనస్‌ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana government announced bonus for Singareni workers

హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2023-24 ఏడాదిలో సింగరేణికి రూ.4,701 కోట్లు లాభం వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్‌గా ప్రకటిస్తున్నట్టు చెప్పారు. సగటున ఒక్కో కార్మికుడికి రూ.1.90లక్షలు బోనస్‌ వస్తుందన్నారు. సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్‌ ప్రకటిస్తున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు.

ఒప్పంద ఉద్యోగులకు కూడా ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. సింగరేణి లాభాల్లో 33 శాతం బోనస్‌గా ప్రకటించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కంటే రూ.20వేలు అదనంగా బోనస్‌ ప్రకటించామని, సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకూ బోనస్‌ ఇస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.